గుడ్డు కూర అంటే అందరికీ ఇష్టం. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి కొత్తగా ట్రై చేయాలనిపిస్తే ఈ రుచికరమైన “న్యూ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ”ను తప్పక ప్రయత్నించండి. ఈ కర్రీ రుచి ఎంత బాగా ఉంటుంది అంటే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా మళ్లీ అడుగుతారు. అన్నం, జీరా రైస్, బిర్యానీ, చపాతీ ఏదానితోనైనా ఈ కర్రీ అద్భుతంగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారుచేయాలో, ఏం కావాలో చూద్దాం.
ముందుగా కొంచెం ఎండుమిర్చి వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఇదే సమయంలో పాన్లో కొద్దిగా నూనె వేసి బాయిల్డ్ గుడ్లలో కారం, పసుపు, ఉప్పు కలిపి వాటిని లైట్గా వేయించాలి. గుడ్లు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించి పక్కన పెట్టాలి.
ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం నూనె వేసి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పలుకులు వేసి మసాలా మెత్తబడేంత వరకు వేయించాలి. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు కలిపి, టమాటా ముక్కలు కూడా వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించాలి. ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని, నానబెట్టిన ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
Related Posts
ఇప్పుడు అసలు గ్రేవీ తయారీకి ముందుకు పోదాం. పాన్లో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి కాస్త కాగిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, షాజీరా వేసి చిన్న మంటపై వేయించాలి. తర్వాత పూర్వమే తయారుచేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి నూనె వదిలే వరకు ఉడికించాలి. ఇందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు, తగినంత ఉప్పు వేసి మళ్లీ కలిపి మూతపెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు పక్కన పెట్టిన వేయించిన గుడ్లు వేసి, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ కలిపి మరో నాలుగు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే.. అద్భుతమైన న్యూ స్టైల్ ఎగ్ గ్రేవీ రెడీ!
ఈ కూరకు అసలైన రుచి రావాలంటే ఎండుమిర్చిని వేడి నీటిలోనే నానబెట్టాలి. ఉల్లిపాయ పేస్ట్ వేయించే సమయంలో నూనె విడిచేంత వరకు కలుపుతూ వేయించాలి. ఫ్రెష్ క్రీమ్ కాకపోతే పాలమీద మీగడ వేసినా చాల మంచి రుచి వస్తుంది. ఒక్కసారి ఈ కర్రీ చేసినా చాలు – మళ్లీ ఎప్పుడూ ఇదే స్టైల్లో చేస్తారు. ఇంత టేస్టీగా, ఘుమఘుమలాడే గుడ్డు కూర ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడే ట్రై చేయండి!