మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద షాక్ తగిలింది.
సత్తెనపల్లిలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. వారు అన్ని చోట్లా బారికేడ్లు ఏర్పాటు చేసి వైసీపీ నాయకులను ఆపడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా కాంటపూడి వద్ద, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల వాహనాలను పోలీసులు ఆపారు. అయితే, అదే మార్గంలో వచ్చిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.
తన వాహనం నుంచి దిగి బారికేడ్లను తొలగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు వినకపోవడంతో, కార్యకర్తలతో పాటు వారిని తోసేశాడు. దీంతో, అంబటి రాంబాబు అనుచరులు, వైసీపీ నాయకుల ప్రవర్తన కారణంగా అక్కడ అకస్మాత్తుగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వారందరినీ నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద అంబటి రాంబాబుపై 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు.