మన పెద్దలు “రుచి అనేది వాసనతోనే మొదలవుతుంది” అంటారు. ఎన్ని కూరగాయలు చేసినా, ఎన్ని మసాలాలు వేసినా… ఆ కర్రీకి ఓ ఘుమఘుమలాడే వాసన లేకపోతే, మళ్లీ తినాలనిపించదు. అలాంటి టైంలో ఓ స్పెషల్ టిప్ మీకోసం! అవిసె గింజలతో చేసిన ఈ కారం పొడి ఒక్క స్పూన్ చాలు – కర్రీ అయినా, టిఫిన్ అయినా అద్భుతంగా మారిపోతుంది.
అవిసె గింజలు అంటే ఫ్లాక్సీడ్లు. ఇవి చిటికెడు పప్పులు లాగే కనిపిస్తాయి. కానీ వీటిలో ఉన్న ఆరోగ్య గుణాలు చెప్పడం మాటల్లో కష్టం! చాలా మంది వీటిని వేయించి పొడి చేసి లడ్డూలుగా తింటుంటారు. కానీ ఇప్పుడు మనం అవిసె గింజలతో రుచికరమైన కారం పొడి ఎలా చేయాలో చూసేద్దాం.
ముందుగా ఒక పాన్ లో కొంచెం నూనె వేసి, మరిగిన తర్వాత అవిసె గింజలు వేసి తక్కువ మంటలో వేయించాలి. బాగా వేగిన తర్వాత అవి బయటకు తీసేయాలి. తర్వాత అదే పాన్ లో మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు వేసి తేలికగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, జీలకర్ర కూడా వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి.
ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఉప్పు, చింతపండు కూడా వేసి రుచి పెంచాలి. టిఫిన్లకి ఉపయోగించాలంటే కాస్త రఫ్గా, కూరల్లోకి వేయాలంటే మెత్తగా పొడి చేయాలి. చివరగా వెల్లుల్లి కూడా జత చేసి మిక్సీలో గ్రైండ్ చేస్తే ఘుమఘుమలాడే కారం పొడి రెడీ!
ఈ కారం పొడిని తెల్లవారు జామున తయారు చేసిన ఇడ్లీ, దోసె, ఉప్మాలో నెయ్యి వేసుకుని తింటే… గిన్నె ఖాళీ చేస్తారు. అలాగే ఆలూ, వంకాయ, బెండకాయ వేపుల్లో చివర్లో ఈ కారం ఒక్క స్పూన్ వేసినా చాలు – మసాలా వేసినట్టే గొప్ప రుచి వస్తుంది.
ఇంకో మంచి విషయం – ఈ పొడిని ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు నెలల పాటు కమ్మగా నిల్వ ఉంటుంది. అంటే, ఓసారి చేసుకుంటే రెండు నెలలు రోజూ రుచి అదిరిపోతుంది!
ఇలాంటి రుచికరమైన కారం పొడి ఇంట్లో ఉండి కూడా బయటటి మసాలాల కోసం చూస్తామా? మీరు ఒక్కసారి చేసి చూడండి… తరువాత మర్చిపోలేరు!