
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్: త్వరలో టీజీపీఎస్సీ నుంచి భారీగా విద్యాశాఖ ఉద్యోగ నోటిఫికేషన్లు!
హైదరాబాద్, జూలై 3: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సన్నద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ ఇప్పటికే టీజీపీఎస్సీకి అందించింది.
[news_related_post]నిజానికి, పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈఓలు, ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు, ఎస్సీఈఆర్టీలోని అధ్యాపకులు, సీనియర్ అధ్యాపకులతో సహా మొత్తం 134 పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ 2022లోనే అనుమతి ఇచ్చింది.
ఖాళీల వివరాలు:
- ఇందులో 24 డిప్యూటీ ఈఓ పోస్టులు ఉన్నాయి.
- 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టులు ఉన్నాయి.
- ఈ 134 పోస్టులతో పాటు తాజాగా దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో 8 ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులు భర్తీ చేసేందుకు కమిషన్కు ప్రతిపాదనలు అందాయి.
మొత్తంగా 142 పోస్టులకు త్వరలోనే 5 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
డిప్యూటీ ఈఓ పోస్టుల పెంపు:
ఉమ్మడి తెలంగాణ పరిధిలో మొత్తం 72 డిప్యూటీ ఈఓ పోస్టులు ఉండేవి. ఒక్కో రెవెన్యూ డివిజన్కు ఒకటి చొప్పున గతంలో కేటాయించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు రెండే ఉన్నప్పటికీ, జనాభా, పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ఒక్క జిల్లాకే ఏకంగా 12 పోస్టులు రానున్నాయి.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లు పెరిగాయి. దీంతో 28 పోస్టులను మంజూరు చేయాలని 2 రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం 33 జిల్లాలకు కలిపి కేవలం 12 డీఈఓ పోస్టులే ఉన్నాయి. అదనంగా మరో 21 పోస్టులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా త్వరలోనే 28 డిప్యూటీ ఈఓ మరియు 21 డీఈఓ పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది.