Employees: అవి గొంతెమ్మ కోర్కెలు కాదు… ఉద్యోగుల హక్కులే!

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ”అభయ హస్తం” పేరుతో విడుదలైన ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు అనేక హామీలిచ్చింది. మూడు విడతల డిఏ బకాయిల చెల్లింపు, పిఆర్సి నివేదిక అమలు, సిపిఎస్‌ విధానం రద్దు, ఉద్యోగుల హెల్త్‌కార్డులు అన్ని ఆసుపత్రుల్లో అమలయ్యేలా నగదు రహిత చికిత్స, జీవో 317కు సవరణ చేయాలని, పదివేల కోట్ల రూపాయల ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు మంజూరు, మార్చి 2024 తర్వాత రిటైర్‌ అయిన ఉద్యోగుల పెన్షనరీ ప్రయోజనాల చెల్లించాలనే ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రంలోని 13.31 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వారి డిమాండ్ల సాధన కోసం 205 సంఘాలతో కూడిన ఉద్యోగుల జేఏసీ ఏర్పాటైంది. ఆనాటి నుంచి జేఏసీ నాయకత్వం 57 డిమాండ్లతో కూడిన (అందులో 12 మాత్రమే ఆర్థికపర మైనవి) ప్రభుత్వం ముందుంచింది. స్పందించిన ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిపి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సమస్యల పరిష్కారం కోసం కొంత సమయమివ్వాలని, మార్చి 2025 తర్వాత ఆర్థిక డిమాండ్లు పరిష్కరిస్తామని ఆలోగా పెండింగ్లో ఉన్న మూడు డిఏ వాయిదాల్లో ఒకటి వెంటనే విడుదల చేస్తానని, వచ్చే మార్చిలో మరో డిఎ ఇస్తానని, ఆర్థికేతర డిమాండ్లపై చర్చించడానికి మంత్రులతో కమిటీ వేస్తామని సమావేశం ముగించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో ఇద్దరు మంత్రులతో ఒక కమిటీ వేసింది. మార్చి 2025 వరకు ఈ కమిటీ సమావేశం కాలేదు. ఆ తర్వాత సబ్‌ కమిటీ, అధికారుల కమిటీ వేసింది. మంత్రుల కమిటీ పరిష్కరించని సమస్యలను అధికారులను అధికారుల కమిటీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పడం రాష్ట్రంలోనే తొలిసారి. కమిటీ లేవి సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో మే మాసంలో ఉద్యోగుల జేఏసీ ”సున్నితమైన, దీర్ఘకాలిక” ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. పదహారు నెలలుగా ఒక్క సమస్యకూడా పరిష్కారం కాలేదని, ఆరు నెలలకోసారి చెల్లించాల్సిన డి ఏ వాయిదాలు కూడా ఇవ్వడం లేదని, జిపిఎఫ్‌ చెల్లింపులు, మెడికల్‌ రియంబర్స్‌మెంట్‌ బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు.

మార్చి 2024 తర్వాత రిటైర్‌ అయిన వ్యక్తులకు రావాల్సిన ప్రయోజనాలు రాకపోవడంతో 12 వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ప్రతినెలా రిటైర్‌ అయ్యే ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది నెలకు 3 నుంచి 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం వంద కోట్లు కూడా విడుదల చేయలేదు. దీనివల్ల రిటైర్‌ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు సంబంధించి ఆరోగ్య కార్డులను అనుమతించే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. సమస్యల తీవ్రత ఇలా ఉండగా, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సిన ముఖ్యమంత్రి తన హౌదాను మరచి ”నన్ను కాల్చుకు తిన్నా.. కోసుకుతిన్నా, జీతాలివ్వడానికి డబ్బులు లేవు, జీతాలివ్వడం కోసం ఏ సంక్షేమ పథకాన్ని నిలిపి వెయ్యిమంటారో చెప్పండి” అంటూ వ్యాఖ్యానించడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఇందులో ప్రజలకు, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టే కుట్ర దాగి ఉన్నదని , తాము బోనస్‌లు, అదనపు భత్యాలు, జీతాలు పెంచాలని కోరడం లేదని.. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని జెఎసి చెబుతున్నది. ఈ సమస్యలు పరిష్కరించాలని తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామంటున్నది.

Related News

ఆందోళన చేస్తున్న ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్య మంత్రులు మాట్లాడడం కొత్త కాదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకంగా సెక్రటేరియట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించిన సందర్భం ఉంది. డిఎలు చెల్లించకుండా నిలిపివేసిన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన చరిత్ర మరచిపోలేనిది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చి డిఎలను విడుదల చేసింది. అలాగే ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక కఠిన చర్యలు తీసుకున్న చరిత్ర తమిళనాడులో జయలలిత ప్రభుత్వం చేసింది. అనేక రాష్ట్రాల్లో ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రులు ఉద్యోగుల పట్ల తీవ్రవ్యాఖ్యలు చేసి అభాసుపాలైన విషయం చరిత్రలో ఉంది. అయితే ఉద్యోగులు ముందుకు తెచ్చిన కోరికలు కొత్తవి కావు. ఈ పార్టీ ప్రభుత్వమే తన ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాలను పదహారు నెలల తర్వాత అయినా అమలు చేయాలని కోరడం తప్పెలా అవుతుంది? మరి బడ్జెట్లో నిధులు లేనప్పుడు వారు ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల ప్రణాళికలో హామీ ఎందుకిచ్చినట్లు ? ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఈ హామీలు ఇచ్చారా? అంటే ” ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, గట్టు చేరాక బోడి మల్లన్న” అన్న చందంగా ఉద్యోగుల ఆత్మ గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడడం ఆశ్చర్యం!

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలమైన విధానాన్ని అవలంభించడంతోపాటు, ఆరు నెలలకు ఒకసారి డిఏ చెల్లించడం, ఐదేళ్లకోసారి పిఆర్సి అమలు చేయడం ఉద్యోగుల పోరాట ఫలాలు. దీన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని విస్మరించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే, చివరకు నష్టపోయేది అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే! ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడానికి కారణాలేంటి? ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యా యులు, కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు,పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఉండేది. ఈ జేఏసీలో వందకు పైగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఉండేవి. జేఏసీ ఆందోళన పిలుపుతో ప్రభుత్వ యంత్రాంగం స్తంభించి పోయే పరిస్థితి ఉండేది. అనేక చారిత్రక పోరాటాలతో ఉద్యోగుల హక్కులను రక్షించిన చరిత్ర ఉమ్మడి ఉద్యమాలది. పాలక పార్టీ ఏదైనా , ఆ పార్టీ పై అభిమానమున్న నాయ కత్వాలు కూడా ఉద్యోగుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయకుండా ఉద్యమాలకు నాయకత్వం వహించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉంది.

రాష్ట్ర విభజన తర్వాత పూర్తిస్థాయిలో ఆనాటి స్ఫూర్తితో ఉద్యోగుల జేఏసీ నిర్మాణం జరగలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏ సంఘము కూడా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలను చేపట్టలేదు. సంఘాల నాయకత్వాలు తెలంగాణ ఉద్యమ కాలంలో పాలక పార్టీతో ఉన్న స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించారు. అంతేకాకుండా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలో ఏదో ఒక పదవి కోసం ఉద్యమ, ఉద్యోగుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేశారు. కనీసం ఉద్యోగుల సమస్యలపై ప్రాతినిధ్యాలుగాని, చర్చలుగాని చేయలేదు. గత పదేండ్ల కాలంలో గొప్పగా చెప్పుకునేవి 43శాతం ఫిట్మెంట్‌ కాగా, పిఆర్సి ద్వారా పరిష్కరించాల్సిన అనేక అనుబంధ సమస్యలన్నీ పెండింగ్‌లో పడ్డప్పటికీ అడిగే నాథుడు లేడు?! చివరికి ఐదేళ్లకోసారి పిఆర్సిసి సిఫార్సులతో పెరగాల్సిన టిఎ, డిఎ రేట్లు, వివిధ రకాల అల వెన్సులు కూడా మారకుండా 2010 నాటి పిఆర్సి అలవెన్స్‌లే కొనసాగిన కిక్కురుమనడం లేదు.

ఈ వివాదం ఇలా ఉండగా సందడిలో సడేమియాలాగా నాడు ప్రభుత్వంతో అంటకాగి, పదవులు అనుభవించి, ఉద్యోగుల సమస్య లను గాలికి వదిలిన మాజీ ఉద్యోగ సంఘ నాయకులంతా ఉద్యోగుల సమన్వయ కమిటీ పేరుతో ఉద్యోగుల జేఏసీని, ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. గత పదేండ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలపై స్పందించకుండా, ఇప్పుడు తాము గతంలో చేసిన తెలంగాణ సాధన ఉద్యమాలను ఏకరువు పెడుతున్నారు. వారి వ్యాఖ్యలతో రాజకీయ ప్రయోజనం నెరవేరచ్చు కానీ, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు. సమైక్య పోరాటాలే సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తాయి. సమైక్య ఉద్యమాలే ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను రక్షిస్తాయి. ఆ మేరకు ఉద్యోగుల జెఎసితో కలిసి సమైక్య ఉద్యమాలకు బాటలు వేస్తూ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలి. క్షేత్రస్థాయిలో సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక, పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపై నిలిచి పోరాట మార్గంలో పయనిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.