ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పును ప్రకటించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించగా, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించబడింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు, 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకున్నందుకు కోపంగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌గా ఏర్పడి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను దారుణంగా హత్య చేశాడు. అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ హత్య ఘటనలో భాగంగా.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై సెక్షన్లు 302, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. 5 సంవత్సరాల 9 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత, కోర్టు సాక్షులు, పోస్ట్‌మార్టం నివేదికలు, శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి తుది తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రధాన నిందితుడు మారుతీరావు తీవ్ర నిరాశకు గురై 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.