“వంకాయ కందిపప్పు ఇగురు” – గుంటూరు స్పెషల్ గురూ – వేడి వేడి అన్నంలో అమృతమే!

Brinjal Dal Fry Recipe in Telugu : ఎప్పుడూ రొటీన్ తినే కురలి కాకుండా ఓసారి ఇలా “వంకాయ కందిపప్పు ఫ్రై” ట్రై చేయండి. తాతల కాలం నాటి ఈ కమ్మటి వంకాయ కూర అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. పులుపుతో, కమ్మని కొబ్బరి పచ్చిమిర్చి ఘాటుతో నోరూరించే లా ఉంటుంది ఈ కర్రీ. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యితో తింటుంటే కలిగే ఫీలింగ్ సూపర్ అలాగే, పండగల టైమ్​లో ఉల్లి, వెల్లుల్లి తినని వారికీ ఇది బెస్ట్ రెసిపీగా నిలుస్తుంది. మరి, ఈ సూపర్ రెసిపీకి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు – అరకిలో
  • కందిపప్పు – పావు కప్పు
  • చింతపండు – ఉసిరికాయ సైజంత
  • పచ్చిమిర్చి – కారానికి తగినన్ని
  • పచ్చికొబ్బరి ముక్కలు – అరకప్పు
  • నూనె – 3 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు – 1 టీస్పూన్
  • మినపప్పు – 1 టేబుల్​స్పూన్
  • శనగపప్పు – 1 టేబుల్​స్పూన్
  • కరివేపాకు – 2 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా

తయారీ విధానం :

ఇందుకోసం ఫస్ట్ ఒక గిన్నెలో కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి, ముప్పావు కప్పు నీళ్లు పోసి గంటకు పైగా నానబెట్టుకోవాలి.

ఇక్కడ మీరు కందిపప్పుకి బదులుగా పెసరపప్పు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు. అలాగే, చింతపండుని నానబెట్టుకోవాలి.

కందిపప్పు నానేలోపు రెసిపీలోకి కావాల్సిన పొడవు వంకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై రెండు అంగుళాల పొడవుతో ముక్కలుగా కట్ చేసుకొని పపక్కన పెట్టుకోండి

ఇప్పుడు స్టౌపై ఒక గిన్నెలో 400 ml వరకు నీరు తీసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు పులుసు అరకప్పు వేసి ఒకసారి కలపాలి.

ఆ తర్వాత మూతపెట్టి పెద్ద మంట మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే, వంకాయ ముక్కలు చింతపండు నీటిలో 80% వరకు ఉడకాలి. అంతేకానీ, మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు.

ఆ విధంగా ఉడికించుకున్నాక వంకాయ ముక్కలను వాటర్ వడకట్టి ఒక బౌల్​లో వేసి పక్కనుంచాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, సన్నని పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేపుకోవాలి.

తాలింపు వేగాక అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు, నానబెట్టిన కందిపప్పుని వాటర్ వడకట్టి వేసుకొని నెమ్మదిగా గరిటెతో కలుపుతూ 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో గరిటెతో నెమ్మదిగా కలుపుతూ కందిపప్పు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి.

ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఆంధ్ర స్పెషల్ “వంకాయ కందిపప్పు ఫ్రై” రెడీ!