GANDHI BHAVAN: అర్ధరాత్రి గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత..

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆశావహులలో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోబోయే నిర్ణయంపై వివిధ సామాజిక వర్గాల నాయకులు నమ్మకంగా ఉన్నారు. అయితే, ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, సీపీఐ నుండి ఒకరికి అవకాశం లభించింది. ఇందులో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలకు చోటు దక్కింది. సీపీఐ నుండి నెల్లికంట్ల శాంత్యమ్‌కు అవకాశం దక్కగా.. కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించిన జాబితాలో ముస్లిం మైనారిటీ నాయకులకు స్థానం లభించకపోవడంతో మైనారిటీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అర్ధరాత్రి గాంధీ భవన్‌కు చేరుకున్న మైనారిటీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింల ప్రాతినిధ్యం లేకపోవడంపై నిరసన తెలిపారు. తెల్లవారుజామున 2 గంటలకు కాంగ్రెస్ ముస్లిం నాయకులు గాంధీ భవన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లిం నాయకులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వలేదని మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిరసన ఉద్రిక్తంగా మారడంతో, రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని బేగంబజార్ మరియు ముషీరాబాద్ స్టేషన్లకు తరలించారు.