హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్ వరకు మెట్రో విస్తరణకు రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండవ దశకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతి గురించి సీఎం రేవంత్ ఆరా తీశారు. ఢిల్లీలోని అధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు. కేంద్రం నుండి ఇంకా అనుమతులు రాలేదు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ మొత్తం 76.4 కి.మీ విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ను కేంద్రానికి పంపింది. ఈ ప్రాజెక్టును కేంద్రంతో సమానంగా పంచుకునేలా జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
Related News
అయితే, కేంద్రం నుంచి అనుమతులు పొందేందుకు నిరంతరం కృషి చేయాలని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రోను 40 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఫ్యూచర్ సిటీ సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు విస్తరించాలని ఆయన అన్నారు. అవసరమైన అంచనాలతో డీపీఆర్ను తయారు చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. ఈ రూట్ మెట్రో విస్తరణలో హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏను కూడా భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.