ప్రతీ నెల జీతం వచ్చినట్టు.. ఖర్చులకు తగినంత డబ్బు చేతికి రావాలంటే.. ఒక స్థిరమైన ఆదాయ వనరు ఉండాలి. ముఖ్యంగా, రిటైర్మెంట్ వచ్చిన తరువాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే, చాలా మంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగం పక్కన ఓ చిన్న ఆదాయ మార్గం కావాలంటూ అన్వేషిస్తున్నారు. అలాంటి వారు ఈ చెప్పబోయే స్కీమ్ అసలు మిస్ అవ్వకూడదు.
పోస్ట్ఆఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్ (MIS) అనేది ప్రభుత్వ హామీతో కూడిన, పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి పథకం. ఇది నెలవారీగా ఆదాయాన్ని అందిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు నెల నెలా ఫిక్స్ అయిన డబ్బును వడ్డీ రూపంలో పొందొచ్చు. రిస్క్ లేని పెట్టుబడి కావాలనుకుంటే.. ఇదే బెస్ట్ ఆప్షన్.
ఈ పథకం సింపుల్గా పనిచేస్తుంది. మీరు ఒక్కసారి కొంత డబ్బు డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుపై పోస్ట్ఆఫీస్ నెలకు నెల వడ్డీ రూపంలో మీ ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది. ఇది మొత్తం 5 సంవత్సరాల పాటు ఇలా జరుగుతుంది. ఐదేళ్ల తర్వాత మీరు వేసిన అసలు మొత్తం కూడా తిరిగి పొందవచ్చు. అంటే, నెలవారీ ఆదాయం కూడా వస్తుంది.. చివరికి అసలు డబ్బూ కూడా మళ్లీ వస్తుంది.
Related Posts
ఈ స్కీమ్లో కనీస పెట్టుబడి రూ.1,000 మాత్రమే. అంటే, చిన్న మొత్తంతోనే ప్రారంభించవచ్చు. గరిష్టంగా చూస్తే.. సింగిల్ అకౌంట్కు రూ.9 లక్షలు వరకు పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్ (రెండు లేదా ముగ్గురు కలిసి) అయితే రూ.15 లక్షలు వరకు పెట్టొచ్చు. మైనర్ పిల్లల పేర మీద కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వారి గార్డియన్ ఈ అకౌంట్ను నిర్వహించవచ్చు.
ఇప్పుడు ఈ పథకంలో 7.40 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. అంటే, మీరు ఏ మొత్తం పెట్టినా దానికి 7.4 శాతం హామీ వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి నెలా చెల్లించబడుతుంది. ఈ వడ్డీ రేటు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష చేయబడుతుంది. అయితే చాలా కాలంగా ఈ రేటు స్థిరంగానే ఉంది. ఇది కూడా మంచిదే.
ఇప్పుడు ఓ లెక్క చూద్దాం. మీరు ఒక సింగిల్ అకౌంట్లో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలకు రూ.5,550 వడ్డీ రూపంలో వస్తుంది. మీరు జాయింట్ అకౌంట్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, నెలకు రూ.9,250 వచ్చేస్తుంది. అదే రూ.5 లక్షలు పెట్టితే రూ.3,083, రూ.3 లక్షలు పెట్టితే రూ.1,850 వస్తుంది. అంటే, ఎంత పెట్టితే ఆ మొత్తానికి తగినట్టుగా నెలవారీ ఆదాయం లభిస్తుంది.
ఈ స్కీమ్ ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. నెలకు ఖర్చులు పక్కాగా ఉండాలంటే, ఇలాంటి ఆదాయ వనరు అవసరం. అలాగే ఇంటి మహిళలు, చిన్న వ్యాపారస్తులు, సురక్షిత ఆదాయం కావాలనుకునే వారందరూ ఈ స్కీమ్ను ఉపయోగించుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లాంటి ప్రమాదాలకు దూరంగా ఉండాలనుకునే వారు ఈ పోస్ట్ ఆఫీస్ ప్లాన్ను ఎంచుకోవచ్చు.
ఒకవేళ మీరు ఐదేళ్లకు ముందే డబ్బు తీసుకోవాలనుకుంటే, కొంత వడ్డీ కోత తప్పదు. అయితే అవసరం వచ్చినప్పుడు ఈ స్కీమ్ నుంచి డబ్బు తీసుకునే వెసులుబాటు ఉంది. ఐతే పూర్తి లాభం పొందాలంటే ఐదేళ్ల వరకు కొనసాగించడం ఉత్తమం.
ఈ స్కీమ్లో డబ్బు పెట్టడం అంటే నెలవారీ రెగ్యులర్ ఆదాయం సృష్టించుకోవడం. ఇది మీ ఖర్చులకు భరోసాగా ఉంటుంది. అలాగే, దీర్ఘకాలానికి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది. పబ్లిక్ ప్రైవేట్ బ్యాంకులకు దీటుగా పోస్ట్ఆఫీస్ MIS స్కీమ్ నిలుస్తోంది. నెల నెలా ఆదాయం కావాలనుకునే వారందరూ ఇది తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. చేతిలో ఉన్న డబ్బును పొడి పెట్టెల్లో పెట్టకుండా.. ఇలా ఫలితం ఇచ్చే పథకంలో పెట్టండి. మళ్ళీ పశ్చాత్తాప పడకుండా.. ఇప్పుడు స్టెప్ తీసుకోండి…