ఈ సంవత్సరం మధ్యలో ఇంటి కొనుగోలు చేసే ప్లాన్ చేస్తున్నవారికి ఓ సూపర్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి వడ్డీ రేట్లు తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల్లో రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. ఫిబ్రవరిలో 0.25 శాతం, తర్వాత ఏప్రిల్లో మరలా 0.25 శాతం తగ్గించి మొత్తం 0.5 శాతం తగ్గించింది. దీని వల్ల 6.5 శాతంగా ఉన్న రెపో రేట్ ఇప్పుడు 6 శాతానికి చేరింది. జూన్లో మరోసారి తగ్గిస్తే అది 5.75 శాతానికి చేరుతుంది. అంటే, మీరు తీసుకున్న లోన్లపై EMI మొత్తం మరింత తగ్గనుంది.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం జూన్ 4న మొదలవుతుంది. ఇది రెండు రోజులు జరిగి, జూన్ 6న నిర్ణయాలు వెల్లడించబడతాయి. ఆ రోజే ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటన చేస్తారు. అందుకే ఆ రోజున దేశంలోని కోట్లు మందికి ప్రభావం చూపే నిర్ణయం వెలువడనుంది.
బ్యాంకుల ట్రెజరీ అధిపతులు, ఆర్థిక నిపుణులు, విశ్లేషకుల అభిప్రాయాలను బట్టి చూస్తే ఈసారి కూడా 0.25 శాతం తగ్గే అవకాశముందని చెబుతున్నారు. అంటే రెపో రేట్ 5.75 శాతానికి చేరుతుంది. ఇది మీ హోం లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్ వంటి అన్ని రకాల లోన్లపై EMIలను తగ్గించనుంది. అంటే ప్రతి నెల మీ జేబులో తక్కువ మొత్తమే పోతుంది. దీన్ని చూసి కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటున్నవాళ్లు వేచి ఉండకుండా వెంటనే ప్లాన్ మొదలు పెట్టాలి.
Related Posts
గత మూడు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతానికి కిందగానే ఉంది. ఇది ఆర్బీఐకి వడ్డీ తగ్గించేందుకు సహాయపడుతోంది. ఆర్బీఐ దృష్టి ఇప్పుడు ద్రవ్యోల్బణం కంటే ఆర్థిక వృద్ధిపై పెరిగింది. అందుకే ఏప్రిల్లో చేసిన వడ్డీ తగ్గింపు సమయంలో మానిటరీ పాలసీ స్టాన్స్ను ‘న్యూట్రల్’ నుంచి ‘అకామోడేటివ్’కు మార్చింది. దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించేందుకు, మార్కెట్లో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఇది పెట్టుబడులు పెరగడం, బిజినెస్ వృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా చేస్తుంది.
మీరు ఇప్పటికే హోం లోన్ తీసుకుని ఉండొచ్చు. లేదా ఇప్పుడే తీసుకోవాలనుకుంటూ సవాళ్లు ఎదుర్కొంటున్నారేమో. మీలాంటి వారికి ఇది చక్కని సమయం. వడ్డీ రేట్లు తగ్గితే మీరు చెల్లించే నెలవారీ EMI కూడా తక్కువ అవుతుంది. అంటే నెలకు 1000-2000 రూపాయల వరకు తగ్గవచ్చు. ఇది తక్కువగానే కనిపించినా, సంవత్సరానికి లెక్కిస్తే పెద్ద మొత్తంగా ఉంటుంది. మీరు ఈ మిగిలిన డబ్బుతో మరిన్ని అవసరాలు తీర్చుకోవచ్చు, లేదా మరో పొదుపు ప్లాన్ ప్రారంభించవచ్చు.
మే 24న ఆర్బీఐ ప్రభుత్వం కోసం ₹2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించింది. ఇది కేంద్రానికి ఆర్థిక లోటును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో ప్రభుత్వం ఖర్చులపై ఒత్తిడి లేకుండా ప్రయోజనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇది మార్కెట్లో లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ మరో అడుగు ముందుకేసే అవకాశాన్ని పెంచుతుంది. దీన్ని బట్టి చూస్తే వడ్డీ తగ్గింపు మాత్రమే కాదు, మరిన్ని ఈజీ లోన్ పరిస్థితులు కూడా రాబోవచ్చు.
ఇప్పుడు చాలామందికి ప్రశ్నేంటంటే, ఇది సరిగ్గా హోం లోన్ తీసుకునే టైమ్ కాదా అని. ఖచ్చితంగా ఇదే టైమ్. ఈ వడ్డీ తగ్గింపుతోపాటు మీరు మంచి బ్యాంక్ ఆఫర్లు చూసుకుంటే, నచ్చిన ఇంటిని తక్కువ EMIతో పొందవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇప్పుడు రివైవల్ దశలో ఉంది. అటు ప్రభుత్వం నుంచి PMAY వంటి స్కీమ్స్ ద్వారా కూడా మద్దతు లభిస్తోంది. అందుకే మీ బడ్జెట్కు సరిపడే హౌస్ కొనడం ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది.
ఈ నెలాఖరులో లేదా, జూన్ 6వ తేదీకి ముందు మీరు మీ లోన్ ప్లాన్ను రివ్యూ చేసుకోవాలి. వడ్డీ రేట్లు తగ్గిన తర్వాత తీసుకునే డిసిషన్ మీకు సంవత్సరాల పొదుపు కలిగిస్తుంది. అందుకే ఆలస్యం చేయకుండా బ్యాంక్తో మాట్లాడండి. కొత్త లోన్ తీసుకునే వారు సిద్ధంగా ఉండండి. తక్కువ వడ్డీతో EMI తగ్గించుకునే గోల్డెన్ ఛాన్స్ మళ్లీ రావడం కష్టం.