
దేశంలో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను అనుసరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. కొత్త కొత్త సిమ్ కార్డులను తీసుకుని మోసాలు చేస్తుండటంతో, అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సైబర్ నేరాలు అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, జూలై 3: దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ద్వారా రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న వారి 27 లక్షల మొబైల్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. సైబర్ మోసం, బ్యాంకు మోసం, బ్లాక్మెయిలింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గత 15 నెలలుగా ఈ సిమ్ కార్డుల బ్లాక్ ప్రక్రియను కేంద్రం ముమ్మరం చేసింది.
మొబైల్ ఫోన్ల ద్వారా కొందరు ఎస్సెమ్మెస్ (SMS), వాట్సాప్, వాయిస్ కాల్ల ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. మార్చి 2024లో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార వేదిక అయిన ‘చక్షు’ పోర్టల్లో దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి DoT ఈ చర్యలు చేపట్టింది. పూర్తి దర్యాప్తు తర్వాత మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉన్న సిమ్ కార్డులను బ్లాక్ చేసింది.
[news_related_post]మొబైల్ ఫోన్ల బ్లాక్: ఎందుకు? ఎలా?
అంతేకాదు, కొత్త కొత్త సిమ్ కార్డులను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి ఫోన్లను సైతం బ్లాక్ చేస్తోంది కేంద్రం. టెలికమ్యూనికేషన్స్ విభాగం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత ఏజెన్సీల సహకారంతో ఈ ఫోన్లను శాశ్వతంగా డీయాక్టివేట్ చేసింది. భవిష్యత్తులో వాటిని ఉపయోగించకుండా మొబైల్ IMEI (International Mobile Equipment Identity) నంబర్లను బ్లాక్ చేశారు.
ఏ ప్రాంతాల్లో ఎన్ని ఫోన్లు బ్లాక్ అయ్యాయి?
డేటా విశ్లేషణ ప్రకారం, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మోసపూరిత కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో డీయాక్టివేట్ చేసిన మొబైల్ల వివరాలు:
- తూర్పు ఉత్తరప్రదేశ్లో: 2,00,000 కంటే ఎక్కువ మొబైల్లు డీయాక్టివేట్ అయ్యాయి.
- పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో: సుమారు 1,44,000 డీయాక్టివేషన్లు జరిగాయి.
- బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో: సుమారు 1,22,000 డీయాక్టివేషన్లు జరిగాయి.
- ఢిల్లీలో: సుమారు 1,15,000 మొబైల్లు బ్లాక్ అయ్యాయి.
- ముంబైలో: అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధం ఉన్న సుమారు 31,000 మొబైల్లు బ్లాక్ అయ్యాయి.
మొత్తంమీద దేశవ్యాప్తంగా డీయాక్టివేట్ చేసిన మొబైల్ నంబర్లు సుమారు 26.95 లక్షలుగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశ ప్రజలను మోసాల బారి నుండి కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడంలో భాగంగానే ఈ స్థాయిలో ఫోన్లను బ్లాక్ చేస్తున్నట్లు వివరించింది.